
- రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమల్ హాసన్
- ఆనందాన్ని స్నేహితుడితో పంచుకున్నానని వెల్లడి
- ‘ఎక్స్’ వేదికగా ఫొటోలు పంచుకున్న కమల్ హాసన్
త్వరలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజినీకాంత్ను కలిశారు. పెద్దల సభలోకి అడుగు పెట్టనున్న నేపథ్యంలో తన ఆనందాన్ని స్నేహితుడితో పంచుకున్నారు. ఈ మేరకు సూపర్స్టార్తో కలిసి దిగిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
“కొత్త ప్రయాణానికి ముందు నాకు ఎంతో ఇష్టమైన స్నేహితుడితో నా ఆనందాన్ని పంచుకున్నాను. ఈ క్షణం నాకు ఎంతో సంతోషంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
కమల్ హాసన్ ఏడేళ్ల క్రితం రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ విపక్ష ఇండియా కూటమిలో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఆయన ప్రచారం చేశారు. దీంతో 2025లో రాజ్యసభకు పంపిస్తామని డీఎంకే ప్రభుత్వం అంగీకరించింది.