
- ఇది సున్నితమైన అంశమన్న విదేశాంగ శాఖ
- నిమిష కుటుంబానికి సహకారం అందిస్తున్నామని వెల్లడి
- అందువల్లే ఉరిశిక్ష వాయిదా పడిందన్న విదేశాంగ శాఖ
యెమెన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసుపై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది అత్యంత సున్నితమైన అంశమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో నిమిష ప్రియకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఆమె కుటుంబం కోసం ఒక న్యాయవాదిని నియమించినట్లు ఆయన వెల్లడించారు.
కేసు పురోగతి వివరాలను తెలుసుకోవడానికి దౌత్యపరంగా సహాయం అందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేలా స్థానిక అధికారులు, కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఈ ప్రయత్నాల ఫలితంగానే ఉరిశిక్ష వాయిదా పడిందని ఆయన గుర్తు చేశారు.
యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియకు అక్కడి అధికారులు ఉరిశిక్షను ఖరారు చేశారు. జూలై 16న అది అమలు కావాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలతో తాత్కాలికంగా వాయిదా పడింది. నిమిష, బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం కావాలని యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. దీంతో ఉరిశిక్షను వాయిదా వేశారు.