తెలంగాణన్యూస్:

- కార్పొరేషన్ అధికారులతో సబిత సమీక్షా సమావేశం
- సమస్యల పరిష్కారంలో అలసత్వంపై ఆగ్రహం
- పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం
బడంగ్ పేట్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ, మల్లాపూర్, మామిడిపల్లి గ్రామాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, స్థానికంగా నెలకొన్న సమస్యలపై మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ తదితర విభాగాల పనితీరుపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి ఆమె తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీరు పని చేస్తున్నారా? లేక టైంపాస్ కోసం కార్యాలయానికి వస్తున్నారా? అని ప్రశ్నించారు.
పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సబిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సరస్వతి, డీఈఈ వెంకన్న, మేనేజర్ నాగేశ్వరరావు, ఏఈ హరీశ్, ఏవో అరుణ, శానిటేషన్ ఇన్స్ పెక్టర్ యాదగిరి, టీపీవో కిరణ్ కుమార్, వర్క్ ఇన్స్ పెక్టర్లు రాకేశ్, వినయ్, కల్యాణ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.